నేపాల్లో ఆందోళన రగుల్చిన సోషల్ మీడియా బ్యాన్ విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున నిరసనలు
కాఠ్మాండు: నేపాల్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ఇవాళ్టి నుంచి “జెన్ జెడ్” పేరుతో యువత వీధుల్లోకి దూసుకువచ్చింది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
మొదట సోషల్ మీడియా స్వేచ్ఛ కోసం మాత్రమే మొదలైన ఈ పోరాటం, క్రమంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. అవినీతి, నిరుద్యోగం, పాలకుల నిరంకుశ వైఖరిపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు కాల్పులు జరపడంతో యువకులు పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిరాయుధంగా నిరసన తెలుపుతున్న యువతపై బుల్లెట్లు దించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించాయి. మరోవైపు, ప్రభుత్వమే పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తోందని నిపుణులు అంటున్నారు.
🔴 ముఖ్యాంశాలు:
- సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయాలని యువత డిమాండ్
- అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన ఆందోళన
- భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది మృతి
- పిట్టల్లా రాలిపోయిన యువకుల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్
👉 నేపాల్ రాజకీయ పరిస్థితులు ఏ దిశగా దారి తీస్తాయో చూడాలి.
Post a Comment