తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంకేతాలు
హైదరాబాద్, జనవరి 06: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన పూర్తిగా శాస్త్రీయంగా లేదని, దాని వల్ల పరిపాలనలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత పాలకులు ప్రజల విజ్ఞప్తులు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే జిల్లాలు, మండలాల విభజన చేపట్టారని మంత్రి విమర్శించారు. అదృష్ట సంఖ్యల ఆధారంగా జిల్లాల ఏర్పాటు జరగడం వల్ల ఒకే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మండలాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లాయని తెలిపారు. దీని కారణంగా ప్రజలు తమ చిన్నచిన్న పనుల కోసం కూడా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు
ప్రస్తుత జిల్లాల నిర్మాణం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రజా సౌలభ్యాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న లోపాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల నుంచి ప్రత్యేక నివేదికలను ప్రభుత్వం కోరిందని తెలిపారు. ఆయా నివేదికలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
ఏకపక్ష నిర్ణయాలు ఉండవు
జిల్లాల మార్పులు, చేర్పుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అధికారుల నివేదికలు అందిన తర్వాత వాటిపై మంత్రివర్గంలో లోతైన చర్చ జరిపి, అనంతరం శాసనసభలో సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటామని స్పష్టం చేశారు.
పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం సంఖ్యల పరిమితిలో కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతోనే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

Post a Comment