చిన్న ఉద్యోగికి కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులను విస్తుపోయేలా చేసిన సోదాలు

చిన్న ఉద్యోగికి కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులను విస్తుపోయేలా చేసిన సోదాలు
చిన్న ఉద్యోగికి కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులను విస్తుపోయేలా చేసిన సోదాలు

కాకినాడ, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన తాజా సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చోడపురెడ్డి శివకుమార్‌కు చెందిన నివాసాలు, కార్యాలయం సహా పలుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు బయటపడినట్లు సమాచారం.

శుక్రవారం ఉదయం నుంచి చేపట్టిన ఈ సోదాలు కాకినాడలోని శివకుమార్ నివాసంతో పాటు ఆయన మామ, సోదరి ఇళ్లలో కూడా కొనసాగాయి. అదేవిధంగా కాకినాడ కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ప్రాథమిక విచారణలో శివకుమార్ తన చట్టబద్ధమైన ఆదాయానికి మించి కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

రూ.8 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

ఏసీబీ అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, శివకుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల విలువ రూ.8 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా వీరి పేర్లపై ఆస్తులు ఉన్నట్లు విచారణలో బయటపడింది.

గుర్తించిన ప్రధాన స్థిరాస్తులు:

కాకినాడలోని ఎస్‌ఆర్‌ఎంటీ అపార్ట్‌మెంట్స్‌లో శివకుమార్ పేరుతో సుమారు రూ.1.24 కోట్ల విలువైన త్రీ బెడ్రూం ఫ్లాట్.

అదే అపార్ట్‌మెంట్స్‌లో ఆయన భార్య పేరుతో రూ.1.77 కోట్ల విలువైన ఫోర్ బెడ్రూం ఫ్లాట్. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో భార్యాభర్తల సంయుక్త పేర్లపై రూ.1.34 కోట్ల విలువైన త్రీ బెడ్రూం ఫ్లాట్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులో ఆయన భార్య పేరుతో ఎకరన్నర వ్యవసాయ భూమి. కాకినాడ రామారావుపేటలో శివకుమార్ పేరుతో రూ.1.20 కోట్ల విలువైన స్థలం. 

ఖరీదైన వాహనాలు కూడా..

సోదాల్లో పలు విలాసవంతమైన వాహనాలను అధికారులు గుర్తించారు. వాటిలో:

టయోటా ఫార్చ్యూనర్ – సుమారు రూ.41.74 లక్షలు

మహీంద్రా ఎలక్ట్రిక్ కారు – సుమారు రూ.30 లక్షలు

మహీంద్రా థార్ రాక్స్ – సుమారు రూ.27 లక్షలు

బంగారం, నగదు, విలువైన వస్తువుల స్వాధీనం

శివకుమార్ నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో:

సుమారు 700 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ.1.06 కోట్లు)

రూ.20 వేల నగదు

రూ.27.12 లక్షల విలువైన ఇతర విలాసవంతమైన వస్తువులు

శామ్‌సంగ్ ఫోల్డ్ 7 మొబైల్ ఫోన్ (సుమారు రూ.1.5 లక్షలు)

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో ల్యాప్‌టాప్ (సుమారు రూ.1.70 లక్షలు) ఖరీదైన 9 చేతి గడియారాలు గుర్తించినట్లు సమాచారం. 

పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ 

కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి వద్ద ఇంత భారీ స్థాయిలో ఆస్తులు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలను కొనసాగిస్తుండగా, తనిఖీలు పూర్తయిన అనంతరం శివకుమార్ ఆస్తులపై పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.