హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన


హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

హైదరాబాద్, నగరంలో కురుస్తున్న అకాల వర్షాల ప్రభావాన్ని స్వయంగా సమీక్షించేందుకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మిక పర్యటన నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా బల్కంపేట, బుద్ధనగర్, మైత్రీవనం వంటి లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

బల్కంపేట బస్తీ, మైత్రీవనంలోని గంగూబాయ్ బస్తీలలో స్థానికులతో సీఎం మాట్లాడి సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, కాల్వల పరిస్థితిపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు.

బుద్ధనగర్‌లో డ్రైనేజీ కాలువ రోడ్డు కంటే ఎత్తులో ఉండటంతో నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన సీఎం, వెంటనే సక్రమం చేయాలని అధికారులకు ఆదేశించారు. గంగూబాయి బస్తీ కుంటను పూడ్చి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుపై, ఆ ప్రాంతాన్ని సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మైత్రీవనం వద్ద నిలిచిపోయిన వరదనీటిని తొలగించేందుకు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

పర్యటనలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధనగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి జస్వంత్, తన ఇంట్లోకి వరదనీరు చేరి పుస్తకాలన్నీ పాడైనట్లు సీఎంకు వివరించాడు. దీనిపై భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.