విద్యార్థులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే వాతావరణం కల్పించడం మన అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్


విద్యార్థులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే వాతావరణం కల్పించడం మన అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్

బూర్గంపాడు,: విద్యార్థులు ఆరోగ్యంగా, సంతోషంగా, ఉత్తమ ఫలితాలు సాధించే వాతావరణం కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

బుధవారం ఆయన బూర్గంపాడు మండలంలోని తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల మరియు వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, పరిశుభ్రత, గాలి ప్రసరణ, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. అనంతరం వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను తనిఖీ చేసి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు.

విద్యార్థినిలతో మమేకమై మాట్లాడుతూ, “మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా?” వంటి ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

భోజనశాలలో వడ్డించటానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో కలిసి భోజనం చేసి సరఫరా విధానం, పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. పోషక విలువలతో కూడిన ఆహారం మాత్రమే అందించాలనే సూచనలు వంట సిబ్బందికి ఇచ్చారు.

“నాణ్యమైన విద్యతో పాటు శుభ్రమైన వసతి, సరైన సదుపాయాలు, పోషకాహారంతో కూడిన భోజనం అందించడం ద్వారానే విద్యార్థులు ప్రతిభ చూపగలరు” అని కలెక్టర్ అన్నారు. పాఠశాల ప్రాంగణంలో మునగ, కరివేపాకు, నిమ్మ గడ్డి వంటి ఉపయోగకరమైన మొక్కలను నాటించి, వాటిని విద్యార్థినులు స్వయంగా సంరక్షించేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ఈ తనిఖీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.