రాష్ట్రవ్యాప్తంగా భూధార్ నెంబర్ల కేటాయింపుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వం, ఇతర మ్యూటేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సూచించారు.
మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. లైసెన్స్ సర్వేయర్లు చేసిన సర్వేలను, రెగ్యులర్ సర్వేయర్లు పూర్వపరిశీలన (స్క్రూటినీ) చేయడం తప్పనిసరి చేయాలని ఆదేశించారు.
సమీక్షలో భాగంగా, కోర్ అర్బన్ ఏరియాలో నిర్మించబోయే 10 కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండేలా, అలాగే ప్రజలకు స్నేహపూర్వక, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా రూపకల్పన చేయాలని సూచించారు.
అలాగే, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాదులో హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Post a Comment