42 శాతం బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్.. గవర్నర్ ఆమోదం
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
ఇప్పటి వరకు అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు కూడా గవర్నర్ అనుమతిని ఇచ్చారు.
ఇక త్వరలోనే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, పురపాలక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఇకపోతే, ఆగస్టు 31న అసెంబ్లీలో, సెప్టెంబర్ 1న శాసన మండలిలో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 2న బిల్లులు రాజ్భవన్కు చేరగా, గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకుని వాటిని ఆమోదించారు.
👉 ప్రధాన అంశాలు
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు
- 50% రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత
- పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం
- త్వరలో గెజిట్ నోటిఫికేషన్, ఆపై ఎన్నికల నోటిఫికేషన్.

Post a Comment