కూటమి సర్కారుకు ఆటోవాలాల హెచ్చరిక – ఆటోల భారీ ర్యాలీ, ప్రదర్శన
విజయవాడ, సెప్టెంబర్ 10 : స్త్రీశక్తి పథకం కారణంగా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటో, క్యాబ్ కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ అనుబంధ ఆటోడ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు.
సీతన్నపేట గేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, శారదా కళాశాల జంక్షన్ వరకు సాగి, తిరిగి సీతన్నపేట గేట్ వద్ద ముగిసింది. రెండు వరుసల్లో వందలాది ఆటోలు, వేలాది ఆటో కార్మికులు పాల్గొనడంతో బీఆర్టీఎస్ రోడ్డు నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీశక్తి పథకం కారణంగా తమ ఉపాధి కోల్పోయామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రదర్శనలో ఆటోడ్రైవర్లు చేసిన ప్రధాన డిమాండ్లు:
- ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలి.
- జీవో నంబర్ 21 ను రద్దు చేయాలి.
- ఆటో, క్యాబ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
- ఐదు శాతం వడ్డీతో రూ.4 లక్షల రుణాలు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందించాలి.
- ఇన్సూరెన్స్ రేట్లు తగ్గించాలి.
- సీఎన్జీ గ్యాస్పై సబ్సిడీ ఇవ్వాలి.
“మా జీవితాలతో ఆటలాడొద్దు. మాకోసం సర్కారు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి” అంటూ ఆటో కార్మికులు గళమెత్తారు.

Post a Comment