తెలంగాణ టిడిపి నాయకులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

తెలంగాణ టిడిపి నాయకులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

తెలంగాణలో పూర్వ వైభవం కోసం సీఎం చంద్రబాబు ఫోకస్

హైదరాబాద్, అక్టోబర్ 07: తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ (టిడిపి) పునరుద్ధరణపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ దృష్టి సారించారు. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా చురుకుదనం చూపని చంద్రబాబు, మళ్లీ పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచించనున్నారు.

ఉండవల్లిలోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం ఆయన తెలంగాణ టిడిపి నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుండగా, టిడిపికి ఆ నియోజకవర్గంలో ప్రాతిపదిక ఉన్నందున — ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 2014లో తెలంగాణలో 15 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తరువాత కాలంలో పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. పలువురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు, "ఓటుకు నోటు" కేసు అనంతరం చంద్రబాబు తెలంగాణ టిడిపిపై దృష్టి తగ్గించారు.

అయినప్పటికీ, ప్రస్తుతం పార్టీకి రెండు మూడు జిల్లాల్లో ఇంకా శక్తివంతమైన కేడర్‌ ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో మళ్లీ తెలంగాణలో పార్టీ పునరుద్ధరణకు ప్రయత్నాలు వేగవంతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.