కర్నూలు బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి!
బస్సు ప్రమాద బాధితులకు ఐదు లక్షల పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : అక్టోబర్ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం భయానక విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై మరణించగా, మరో 21 మంది క్షేమంగా బయటపడ్డారు.
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకున్న వారిలో చాలామంది తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన గొళ్ల రమేశ్ కుటుంబం అగ్నికి ఆహుతైందని సమాచారం. అలాగే యాదాద్రి జిల్లాకు చెందిన ఓ యువతి కూడా మృతి చెందింది.
బెంగళూరులో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన రాము అనే వ్యక్తి తన తల్లితో కలిసి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బంధువుల ఇంట్లో దీపావళి జరుపుకుని, గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో కావేరి ట్రావెల్స్ బస్సులో తిరిగి బెంగళూరుకు బయల్దేరారు. చిన్నటేకూరు వద్ద బస్సు ఓ బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమయింది. ఈ దుర్ఘటనలో తల్లి–కొడుకులిద్దరూ సజీవదహనమయ్యారు.
అదే బస్సులో ప్రయాణిస్తున్న యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, దీపావళి సందర్భంగా స్వగ్రామానికి వచ్చి తిరిగి పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కర్నూలు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Post a Comment