తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికలు!

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల హెచ్చరికలు!


హైదరాబాద్‌, నవంబర్‌ 4: తెలంగాణలో నేడు విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం వేళల్లో ఎండ కనిపించినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై రాత్రివేళల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ క్రమంలో వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల్‌, నల్గొండ, సూర్యాపేట‌, యాదాద్రి–భువనగిరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్‌ నగర వాతావరణం:
రాజధాని పరిసరాల్లో విస్తారమైన లేదా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నుంచి రాత్రివేళ ఒక స్పెల్‌గా మోస్తరు వర్షం పడవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం రాబోయే రెండు గంటల్లో యాదాద్రి–భువనగిరి, జనగామ, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వనపర్తి, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.

రికార్డు స్థాయిలో వర్షపాతం:
ఈ సంవత్సరం రుతుపవనాల ప్రారంభం నుంచి అక్టోబర్‌ వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అక్టోబర్‌లో కురిసిన కుండపోత వర్షాలు గత రికార్డులను చెరిపేశాయి. ‘మొంథా తుఫాన్’ ప్రభావంతో అక్టోబర్‌లో రాష్ట్ర సగటు వర్షపాతం 175 మి.మీ. గా నమోదవ్వడం గమనార్హం. ఇది సాధారణంగా ఉండే 89.4 మి.మీ. కంటే 96 శాతం అధికం.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఒక్క రోజులోనే 422 మి.మీ. వర్షపాతం నమోదై చరిత్ర సృష్టించింది. మొత్తంగా జూన్‌–అక్టోబర్‌ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 33 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గత మూడు సంవత్సరాల అక్టోబర్‌ వర్షపాతం పోలిస్తే —

  • 2021లో: 80 మి.మీ.
  • 2022లో: 60 మి.మీ.
  • 2023లో: 95.9 మి.మీ.
  • 2025లో: 175 మి.మీ.

ఈ గణాంకాలు ఈ ఏడాది తెలంగాణలో వర్షాల తీవ్రత ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తున్నాయి.

అధికారుల హెచ్చరిక:
భారీ వర్షాలు, పిడుగులు సంభవించే ప్రాంతాల్లో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తాత్కాలికంగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.