పాడి పంటల పండుగగా ముందస్తు సంక్రాంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామవరం, జనవరి 10 : సంక్రాంతి ధార్మిక పండుగ కాదని, ఇది పాడి పంటల పండుగ, రైతుల పండుగ అని, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి జరుపుకోవాల్సిన పండుగ అని మోడ్రన్ ఇఖ్రా పాఠశాల కరస్పాండెంట్ షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం మండలం సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నెముక అని, అన్నప్రదాత అని అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగే సంక్రాంతి అని వివరించారు.
రైతులు సంతోషంగా ఉంటేనే సమాజం సుఖసంతోషాలతో ఉంటుందని పేర్కొన్న ఆయన, రైతన్నల పండుగైన సంక్రాంతిని కులమత భేదాలు లేకుండా గౌరవించాలని కోరారు. మన సంతోష సమయంలో మనకు అన్నం పెట్టే రైతును గుర్తుచేసుకోవాలని, వీలైతే ఒక్క రైతుకైనా సహాయం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో రైతు గొప్పదనాన్ని, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యాపకురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, నీలా, అనితా, సరస్వతీ, శిరీషా, నసరత్, నాజియా, సల్మా, జేఫీషా, లతీఫా, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Post a Comment