మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మే 13: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఇల్లందు వ్యవసాయ కమిటీ, చల్లసముద్రం, టేకులపల్లి, బోడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు, నిల్వ, లోడింగ్, రవాణా ప్రక్రియలపై సమీక్ష నిర్వహించారు.
మొదటగా ఇల్లందు వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ నిల్వ ఉంచిన మొక్కజొన్న బ్యాగులు, కొనుగోలు వివరాలు, గోదాముల సామర్థ్యం, హమాలీల అందుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 54 వేల మొక్కజొన్న బ్యాగులు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ కమిటీ ప్రాంగణంలోని గోదాముల్లో సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు వివరించారు.
లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు స్థానిక కూలీల ద్వారా అదనపు లోడింగ్ పనులు చేపడుతున్నామని అధికారులు తెలియజేయగా, రోజువారీ చెల్లింపులు వెంటనే చేపట్టి లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, నిల్వ స్థలాల కొరత నివారణకు గిరిజన భవనాలు, కళాశాలల ఫంక్షన్ హాల్స్ వంటి ప్రత్యామ్నాయ ప్రదేశాలను గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
రవాణా ప్రక్రియ వేగవంతం చేసేందుకు ట్రాక్టర్లు, డీసీఎంలను కూడా వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్, రెండు రోజుల్లో లోడింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం రేపల్లెవాడలోని చల్లసముద్రం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్కు రైతులు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడం, గన్ని బ్యాగుల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ జిల్లా రవాణా శాఖ అధికారులతో మాట్లాడి తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి వెంటనే 50 వేల గన్ని బ్యాగులు సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో 17 వేల మొక్కజొన్న బ్యాగులు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కొమరారం కొనుగోలు కేంద్రంలోని నిల్వలను కారేపల్లి గోదాములకు తరలిస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కారేపల్లిలో 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉన్నందున అక్కడ నిల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తర్వాత టేకులపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ టేకులపల్లి వ్యవసాయ కమిటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని మొక్కజొన్న నిల్వలు, రవాణా సదుపాయాలు, హమాలీల అందుబాటు, గోదాముల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలో సుమారు 1.50 లక్షల మొక్కజొన్న బ్యాగులు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా కోదాడ మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తరలిస్తున్నట్లు వివరించారు.
ప్రత్యామ్నాయ నిల్వల కోసం టేకులపల్లి ఉన్నత పాఠశాలలో తాత్కాలిక నిల్వలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా పెట్రాల చిలక గ్రామంలో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు చెందిన రెండు గోదాములు ఉండగా, వాటికి 10 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు వివరించారు. వెంటనే ఆ గోదాములను వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన అనుమతులు పొందాలని, తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం 148 మంది హమాలీలు అందుబాటులో ఉన్నారని అధికారులు తెలపగా, రవాణా కోసం తగినన్ని లారీలు ఏర్పాటు చేసి నిల్వల తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం బోడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, కేంద్రంలో సుమారు 6 వేల మొక్కజొన్న బ్యాగులు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రవాణా ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా ట్రాక్టర్లతో కొనుగోలు కేంద్రం వద్ద వేచి ఉన్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన కలెక్టర్ ట్రాక్టర్లలో ఉన్న మొక్కజొన్నను కొత్తగూడెం మార్కెట్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తగినన్ని గన్ని బ్యాగులు సరఫరా చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, రవాణా, గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment