ఐఎఫ్ఎస్ విజేత శశాంక్ దహగామకు ఘన సన్మానం
ఐఎఫ్ఎస్ విజేత శశాంక్ దహగామకు ఘన సన్మానం
గోదావరిఖని, జూలై 26: భారత అటవీ సేవ (ఐఎఫ్ఎస్)లో ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన యువ అధికారి శశాంక్ దహగామకు గోదావరిఖనిలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు. రైతు సంక్షేమ సమితి, పలు స్వచ్ఛంద సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీ గణేష్నగర్లోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
నాగలక్ష్మి–ఉమామహేశ్వర్ దంపతుల కుమారుడైన శశాంక్ దహగామ సాధించిన అరుదైన విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సభకు జమాత్-ఎ-ఇస్లామీ హింద్ నాయకులు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువత లక్ష్యసాధనకు శశాంక్ ఆదర్శంగా నిలిచారని, ఆయన విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ఫసీయుద్దీన్, మహమ్మద్ ముస్తఫా, మొహమ్మద్ ఫయాజుద్దీన్, మజ్హరుద్దీన్, అక్రమ్, అబ్దుల్ సత్తార్ తదితర ప్రముఖులు శశాంక్ దహగామను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో రైతు సంక్షేమ సమితి నాయకులు ఏలేశ్వరం వెంకటేష్, వేముల అశోక్, ప్రకాష్ రెడ్డి, ములుగు వెంకటేష్, ఎనగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అడవుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణపై యువతలో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో "తెలంగాణ గర్వకారణం – అడవులను కాపాడుకుందాం... భవిష్యత్తుకు భరోసా ఇద్దాం (Save Forests, Save Future)" అనే సందేశంతో ఈ అభినందన సభను నిర్వహించినట్లు తెలిపారు. శశాంక్ దహగామ వంటి యువ అధికారులు సమాజానికి ఆదర్శంగా నిలిచి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

Post a Comment