జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు 21 మంది అధ్యాపకుల ఎంపిక
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా విభాగంలో దేశవ్యాప్తంగా 21 మంది అధ్యాపకులు ప్రతిష్ఠాత్మక జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ గౌరవానికి ఎంపిక కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎయిమ్స్ మంగళగిరి మెడికల్ పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ అరుణ్ బాబు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఐఐటీ తెలంగాణ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధి, విద్యా రంగానికి అందించిన విశిష్ట సేవలను పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు చెందిన 21 మంది అధ్యాపకులను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన డాక్టర్ అరుణ్ బాబు, ప్రొఫెసర్ కీర్తి చంద్ర సాహులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల విద్యా రంగానికి చెందిన పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment