ఖైరతాబాద్ గణేష్ ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్, ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి (అడ్హక్) కమిటీ ప్రతినిధులు శాసనసభ్యుడు దానం నాగేందర్ నేతృత్వంలో సీఎం ని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం అందజేశారు.
ప్రతినిధి బృందం వివరాల ప్రకారం, ఈ ఏడాది “శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి-2025” రూపంలో ఖైరతాబాద్ గణపతి భక్తుల దర్శనార్థం వెలుగులోకి రానున్నాడు. నవరాత్రి పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఆశీర్వచనం అందించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
దాదాపు అరవై ఏళ్ల చరిత్ర గల ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షించే మహోత్సవంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు విచ్చేసి మహాగణపతి దర్శనం చేసుకుంటారు. ఈ సారి కూడా అత్యంత భవ్యంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి అడ్హక్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post a Comment