గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ, ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని పోలీసులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. అవసరం లేకుండా బయటకు రాకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా డయల్ 100 ద్వారా సహాయం పొందాలని సూచించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భాల్లో వీడియోలు లేదా సెల్ఫీల కోసం వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
అలాగే వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు.
Post a Comment