తెలంగాణ రేషన్ కార్డు దారులకు నిరాశ.. ఈసారి బతుకమ్మ చీరలు లేవు!

 మహిళా సంఘాలకే పంపిణీ – ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు

తెలంగాణ రేషన్ కార్డు దారులకు నిరాశ.. ఈసారి బతుకమ్మ చీరలు లేవు!


హైదరాబాద్: బతుకమ్మ పండుగ దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. అయితే ఈసారి రేషన్ కార్డు ఆధారంగా కాకుండా కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం ప్రకారం ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు ఇవ్వనున్నారు. ఒక్కో చీర విలువ రూ.800 కాగా, రెండింటి విలువ రూ.1600 అవుతుంది. గత ఏడాది రేషన్ కార్డు ఉన్న మహిళలకు కూడా ఈ కానుక అందగా, ఈసారి వారిని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

రేషన్ కార్డు దారుల్లో ఆవేదన

పల్లెల్లో, పట్టణాల్లో రేషన్ కార్డు ఆధారంగా గతంలో అనేక మంది మహిళలు చీరలు పొందారు. ఆ చీరలు నాసిరకమైనవని విమర్శలు వచ్చినా కూడా చాలామంది సంతోషంగా తీసుకున్నారు. కానీ ఈసారి తమను విస్మరించడం అన్యాయమని మహిళలు మండిపడుతున్నారు. "మేము కూడా పేదవారమే. రేషన్ కార్డు ఆధారంగా సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే బతుకమ్మ చీరల్లో మాకు తేడా ఎందుకు?" అంటూ ప్రశ్నిస్తున్నారు.

'ఇందిరా మహిళా శక్తి' సంఘాలకే పంపిణీ

ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో మహిళా సంఘాల జాబితా ఆధారంగానే పంపిణీ జరగనుందని స్పష్టం చేసింది. సిరిసిల్లలో తయారైన చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. కొన్ని ఏరియాల్లో పంపిణీ కూడా ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో చీరలు గోదాముల్లో నిల్వ ఉంచి, అక్కడి నుంచి మండలాలవారీగా పంపిణీ జరగనుంది.

ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కానుకలు

ఇదిలా ఉంటే కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక దృశ్యం చోటుచేసుకుంది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన స్వంత ఖర్చుతో 20మంది ట్రాన్స్‌జెండర్లకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ప్రతి పండుగలో అందరినీ సమానంగా గుర్తించడం, గౌరవించడం మన సామాజిక బాధ్యత” అన్నారు.

ట్రాన్స్‌జెండర్లు ఈ సహకారం తమకు నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.