మళ్లీ వానలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీలుస్తున్న తరుణంలోనే మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీన పడనుందని, అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ అక్టోబర్ 1వ తేదీ నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇదిలాఉంటే, మంగళవారం అండమాన్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అది అక్టోబర్ 1నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుందని తెలిపింది.
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
➡️ ఉత్తర తెలంగాణ జిల్లాలు – అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
➡️ హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం సమయాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Post a Comment