శృంగారంలో గుండెపోటు అంటూ నాటకం.. భర్తను ఉరి వేసి చంపిన భార్య!
కరీంనగర్లో హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు
కరీంనగర్: ప్రేమతో మొదలైన దాంపత్య జీవితం దారుణాంతం పొందింది. డబ్బుల కోసం భర్తను వేధిస్తున్నాడని కోపంతో భార్య భర్తను హత్య చేసిన ఘటన కరీంనగర్లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో భార్యతో పాటు మరో ఐదుగురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం — కత్తి మౌనిక, సురేశ్ దంపతులు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సప్తగిరి కాలనీలో నివాసముంటూ ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే ఇటీవల మౌనిక వేశ్యావృత్తిలోకి అడుగుపెట్టింది. దీంతో భర్త సురేశ్ తరచుగా డబ్బుల కోసం వేధించడంతో ఇద్దరి మధ్య తగాదాలు పెరిగాయి. ఈ క్రమంలో మౌనిక తన భర్తను చంపేయాలని పథకం వేసింది.
తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య అలియాస్ వేముల రాధ, నల్ల దేవదాస్లకు ఈ విషయాన్ని చెప్పింది. వారందరూ హత్యకు సహకరించేందుకు సిద్ధమయ్యారు. మొదట వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపే ప్రయత్నం చేసింది కానీ వాసనతో సురేశ్ అనుమానం పొంది తినలేదు.
తర్వాత సెప్టెంబర్ 17న ప్లాన్–బీ ప్రకారం, సురేశ్ మద్యం తాగుతుండగా అందులో బీపీ, నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అవి తాగిన సురేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మౌనిక చీరతో భర్త మెడ బిగించి, కిటికీ గ్రిల్కి వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత కుటుంబ సభ్యులకు “శృంగారంలో ఉండగా గుండెపోటు వచ్చిందని” చెప్పి నాటకం ఆడింది.
సురేశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి మౌనిక కదలికలపై ఫోకస్ పెట్టారు. చివరకు విచారణలో మౌనిక నేరాన్ని ఒప్పుకుంది. తాను, తన బంధువులు కలసి భర్తను హత్య చేసినట్లు తెలిపింది. టూ టౌన్ పోలీసులు నిందితులందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్కు తరలించారు.

Post a Comment