స్విమ్మింగ్ పూల్లో మృత్యువాత పడ్డ ఇద్దరు విద్యార్థులు
నార్కట్పల్లి మండలం జివ్విగూడెం వద్ద విషాద ఘటన
నల్గొండ జిల్లా అక్టోబర్ 4 : నార్కట్పల్లి మండలంలోని జివ్విగూడెం గ్రామ పరిధిలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను కలచివేసింది. ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు స్విమ్మింగ్ పూల్లో మునిగి మృతిచెందారు.
వివరాల్లోకి వెళితే — నార్కట్పల్లి లోని కామినేని విద్యాపీఠ్ స్కూల్కు చెందిన 13 మంది విద్యార్థులు శనివారం ఉదయం వెంకటేశ్వర్లబావి కాలనీ సమీపంలోని ఓ గెస్ట్హౌస్కు ఈత కొట్టడానికి వెళ్లారు. ఈత రాని ఇద్దరు విద్యార్థులు అనుకోకుండా లోతైన నీటిలోకి వెళ్లి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, నార్కట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రంగా ప్రయత్నించి చివరికి విద్యార్థుల మృతదేహాలను స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు తీశారు.
మృతి చెందిన విద్యార్థులను నార్కట్పల్లికి చెందిన నల్లగొండ రిషిక్ (17), చౌటుప్పల్కు చెందిన పోలోజు హర్షవర్ధన్ (17) గా పోలీసులు గుర్తించారు. పాత బావిని స్విమ్మింగ్ పూల్గా మార్పిడి చేయడం వల్ల అది చాలా లోతుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Post a Comment