డా. టి. అరుణ కుమారికి ‘మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం

డా. టి. అరుణ కుమారికి ‘మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం


పాల్వంచ, అక్టోబర్ 10: ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), పాల్వంచలో హిందీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ టి. అరుణ కుమారి గారికి ప్రతిష్టాత్మకమైన “మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం” లభించింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ‘రుషి వైదిక విద్యాపీఠం’ సంస్థ ఈ అవార్డును డా. అరుణ కుమారి గారికి ప్రదానం చేసింది. దేశ సేవ, సమాజ సేవ, విద్యా సేవ, పరిశోధన, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డు అందజేయడం జరుగుతుంది.

జాతీయ స్థాయిలో వందకు పైగా అభ్యర్థులు ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోగా, రెండు దశల ఎంపిక ప్రక్రియ అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి డాక్టర్ టి. అరుణ కుమారి ఎంపికయ్యారు.

హిందీ భాషా అభ్యున్నతి, విద్యార్థుల అభివృద్ధి, హిందీ సాహిత్య పరిశోధనలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు ఒక పతకం (మెడల్) మరియు ప్రశంసాపత్రం అందజేశారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థి బృందం తరఫున ఆమెను శాలువాతో సన్మానించారు.

గతంలో రాష్ట్రస్థాయిలో “స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు” అందుకున్న డా. అరుణ కుమారి గారికి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ అవార్డు లభించడం కళాశాలకు, తెలంగాణ విద్యారంగానికి గర్వకారణమని పలువురు అభినందించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.