అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” రచయితగా అందెశ్రీ చేసిన కృషి అమూల్యమని, ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణ ఉద్యమ దశలో, రాష్ట్ర సాధనలో “జయ జయ హే తెలంగాణ” గేయం కోట్లాది ప్రజల గొంతుకగా మారిందని గుర్తుచేశారు. ఆ పాటతో ప్రజల్లో చైతన్యం నింపిన అందెశ్రీ తెలంగాణ భావజాలానికి ప్రతీకగా నిలిచారని సీఎం పేర్కొన్నారు.

అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరరూపం దాల్చినప్పుడు అందెశ్రీతో పంచుకున్న ఆలోచనలు తాను మరచిపోలేనివని అన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ, ఆయన మరణం తీరని నష్టం అని విచారం వ్యక్తం చేశారు.

స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో అందెశ్రీ చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.