రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నవంబర్ 8, 9, 10 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల అండర్-17 కబడ్డీ పోటీలు, అలాగే జనవరి నెలలో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాలుర కబడ్డీ పోటీలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న ప్రాంగణ నిర్మాణం, కోర్టుల ఏర్పాటు, వసతి, భద్రతా చర్యలు మరియు మౌలిక సదుపాయాల పరిస్థితిని సమీక్షించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “రాష్ట్ర స్థాయిలో జరగబోయే ఈ కబడ్డీ పోటీలు భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీలకు వేదికగా నిలుస్తాయి. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిష్టకు తగ్గట్టుగా ఈ కార్యక్రమాలు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించాలి” అని తెలిపారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు, అధికారులు మరియు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున సదుపాయాల విషయంలో ఎటువంటి లోపాలు ఉండకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
కబడ్డీ పోటీల నిర్వహణకు నాలుగు కోర్టులను ఏర్పాటు చేయాలని, వీక్షకుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా కోర్టులను సరైన దూరంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీ గోడను తాత్కాలికంగా తొలగించి పక్కనే ఉన్న అటవీ శాఖ నర్సరీ ప్రదేశాన్ని వినియోగించడం ద్వారా స్థలం విస్తరించి, పోటీలు సౌకర్యవంతంగా నిర్వహించవచ్చని ఆయన సూచించారు.
గ్రౌండ్ కోసం అవసరమైన గ్రావెల్ను తక్షణమే సమకూర్చి పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, శానిటేషన్, ఆరోగ్య శిబిరం, ఫస్ట్ ఎయిడ్, పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకల నియంత్రణ, భద్రతా సిబ్బంది నియామకం వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
జిల్లా యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ, విద్యాశాఖ, పోలీసు శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, అటవీ మరియు ఆరోగ్య శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీ ఓ. వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఏఈ మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment