ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట బకాయి బిల్లుల చెల్లింపులకు రూ.713 కోట్లు విడుదల
హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ఊరటనిస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల పరిష్కారంలో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి రూ.713 కోట్ల నిధులను విడుదల చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు తక్షణమే నిధులను మంజూరు చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ప్రతినెల కనీసం రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీకి కట్టుబడి ప్రభుత్వం వరుసగా నిధులు విడుదల చేస్తూ వస్తోంది.
జూన్ నెలాఖరులో తొలిసారిగా రూ.183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఆగస్టు మాసం నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.700 కోట్లకు తగ్గకుండా నిధులను మంజూరు చేస్తోంది. తాజా విడుదలతో ఆ హామీ మరోసారి నెరవేరినట్టయ్యింది.
ఏ ఏ బకాయిలకు పరిష్కారం?
ఈ రూ.713 కోట్ల నిధులతో
- గ్రాట్యూటీ
- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF)
- సరెండర్ లీవ్ బిల్లులు
- వివిధ రకాల అడ్వాన్స్లకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్లు
పరిష్కారమవనున్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ఈ నిధులను కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుసగా బకాయి బిల్లులు విడుదలవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Post a Comment