జాతీయ లోక్ అదాలత్ విజయవంతం జిల్లా వ్యాప్తంగా 7,233 కేసులు పరిష్కారం

 

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం జిల్లా వ్యాప్తంగా 7,233 కేసులు పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్


కొత్తగూడెం, డిసెంబర్ 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ అత్యంత విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. జిల్లా లోని అన్ని కోర్టుల పరిధిలో మొత్తం 7,233 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా కక్షిదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని, వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.

వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే సమాజానికి మేలని పేర్కొంటూ, “రాజీ మార్గమే రాజమార్గం” అని స్పష్టం చేశారు. చిన్న చిన్న తగాదాలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో జీవించాలని కక్షిదారులకు సూచించారు.

కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కొనియాడారు. రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డులు అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై అవార్డు పాస్ అయితే అది అంతిమ తీర్పుగా అమలులో ఉంటుందని వివరించారు. లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు ఎస్‌బీఐ బ్యాంక్ వారి సౌజన్యంతో పులిహోర, మంచినీటి సదుపాయాలు కల్పించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె. కిరణ్ కుమార్, మేజిస్ట్రేట్లు సుచరిత, రవికుమార్, వినయ్ కుమార్, మెండు రాజమల్లుస్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె. గోపికృష్ణడిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, ఆర్. రామారావు, ఎస్‌బీఐ బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.