స్కూల్‌కు రివాల్వర్‌ తెచ్చిన విద్యార్థి… ప్రధానోపాధ్యాయుడికి బెదిరింపు

స్కూల్‌కు రివాల్వర్‌ తెచ్చిన విద్యార్థి… ప్రధానోపాధ్యాయుడికి బెదిరింపు


14 ఏళ్ల బాలుడి దుస్సాహసం.. పోలీసుల అదుపులోకి

భువనేశ్వర్‌ | డిసెంబర్‌ 15: ఒడిశా రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కు రివాల్వర్‌ తీసుకొచ్చిన ఓ విద్యార్థి, తనను మందలించాడని ప్రధానోపాధ్యాయుడిని గన్‌తో బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కేంద్రపారా జిల్లా కొరువా గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో జరిగింది.

9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు శనివారం స్కూల్‌కు దేశీయ రివాల్వర్‌ను తీసుకువచ్చాడు. తరగతి గదిలో తనను తిట్టినందుకు ఆగ్రహించిన అతడు, ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులను గన్‌తో బెదిరించాడు.
“నేను ఈ స్కూల్‌లో చదువుతున్నంత కాలం నన్ను తిట్టకూడదు… ఎక్కువ మార్కులు వేయాలి… లేకపోతే ఈ బులెట్‌ నీ తలలో లేదా గుండెల్లోకి పంపిస్తాను” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.

ఈ ఘటనతో ఉపాధ్యాయులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. వెంటనే హెడ్‌మాస్టార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు స్కూల్‌కు చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న దేశీయ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మైనర్ కావడంతో బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి, అనంతరం స్పెషల్ హోమ్‌కు తరలించారు. రివాల్వర్‌ బాలుడికి ఎలా అందిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు, బంధువులను ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. పాఠశాలల్లో భద్రత, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణపై చర్చకు తెరలేపింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.