ఆశా వర్కర్ల ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం భగ్నం చేసిన పోలీసులు
తూప్రాన్, డిసెంబర్ 29: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడి కార్యక్రమాన్ని తూప్రాన్ పోలీసులు భగ్నం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగానే అడ్డుకున్నారు.
సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తూప్రాన్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సొంత పూచీకతపై విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే నిరసన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Post a Comment