కేవలం ఐదు నిమిషాలే.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 29: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) అసెంబ్లీ సమావేశాలకు హాజరై కేవలం ఐదు నిమిషాల్లోనే సభ నుంచి వెళ్లిపోయారు. సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ సభను వీడారు.
ఉదయం నందినగర్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను సభలోకి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేసీఆర్ తన కేటాయించిన చైర్లో కూర్చున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించిన వెంటనే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ను కలిసి పలకరించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి కేసీఆర్ బయటకు వచ్చి అసెంబ్లీ నుంచి నందినగర్ నివాసానికి తిరిగి వెళ్లిపోయారు.
కేసీఆర్ను కలిసిన సీఎం రేవంత్
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం పలకరించగా, తాను బాగున్నానని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్లతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు కలిసి కరచాలనం చేశారు.

Post a Comment