తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తొలి రోజు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించబడినట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణుగోపాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అంతరాయం లేకుండా పరీక్షలు క్రమబద్ధంగా నిర్వహించబడినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల, అలాగే పాల్వంచలో ఏర్పాటు చేసిన ఇతర పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రతా పంపిణీ విధానం, అభ్యర్థుల తనిఖీ ప్రక్రియ, ఇన్విజిలేషన్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను సమీక్షించి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడినట్లు ఆయన తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలు కలిపి మొత్తం 9,685 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 9,210 మంది పరీక్షలకు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 7,973 మంది ఉండగా 7,683 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,712 మంది ఉండగా 1,527 మంది పరీక్షలు రాశారు. మొత్తం 475 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు.

పరీక్షల సందర్భంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర మౌలిక వసతులు సమృద్ధిగా కల్పించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

తదుపరి రోజుల్లో నిర్వహించనున్న పరీక్షలను కూడా ఇదే విధంగా పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.