పెళ్లి విందులో చికెన్ లెగ్ పీస్ల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న బందువులు
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా లో జరిగిన ఓ విచిత్ర సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లిళ్లలో చిన్న చిన్న విషయాలపై వాగ్వాదాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం చికెన్ లెగ్ పీస్ల కోసం పెళ్లి వేడుకే రణరంగంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హసన్పూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, సమీప గ్రామానికి చెందిన యువకుడి వివాహం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడి తరఫు బంధువులకు ఏర్పాటు చేసిన విందులో బిర్యానీ వడ్డించే సమయంలో తమకు తగినన్ని చికెన్ లెగ్ పీస్లు రాలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిన్నపాటి వాగ్వాదంగా మొదలైన ఈ వివాదం, క్షణాల్లోనే పెద్ద గొడవగా మారింది. ఇరువర్గాల వారు కోపంతో కుర్చీలు, పళ్ళాలు, గ్లాసులు ఒకరిపై ఒకరు విసురుకోవడంతో విందు ప్రాంగణం యుద్ధభూమిలా మారింది. ఈ ఘర్షణలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.
ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వీడియో ఆధారంగా గొడవకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చిన్న విషయమైన లెగ్ పీస్ కోసం పెళ్లి వేడుకను ఇలా రసాభాస చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Post a Comment