ముగ్గురు భర్తల ముద్దుగుమ్మ ప్రేమ, బెదిరింపులు, నకిలీ కేసులతో పెళ్లిళ్లు మహిళ మోసాల వ్యవహారం కలకలం
ముగ్గురు భర్తల ముద్దుగుమ్మ ప్రేమ, బెదిరింపులు, నకిలీ కేసులతో పెళ్లిళ్లు మహిళ మోసాల వ్యవహారం కలకలం
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఓ మహిళ ప్రేమ పేరుతో పలువురిని వలలో వేసుకుని, బెదిరింపులు, నకిలీ కేసులతో పెళ్లిళ్లు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మోసం, భూ ఆక్రమణ ఫిర్యాదులపై అరెస్టైన వర్ష అనే మహిళపై ఆమె మాజీ భర్తలే తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసుల విచారణలో వర్షతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 13 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ల్యాబ్ యజమాని సచిన్ సింగ్ రాజ్పుత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, వర్ష తన ల్యాబ్లో రిసెప్షనిస్ట్గా పనిచేసేది. నగదు లావాదేవీల్లో అక్రమాలు, అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించగా, ప్రతీకారంగా తన మేనల్లుడిని ప్రభావితం చేసి, హోటల్లో తన ఐడెంటిటీ కార్డు ఉపయోగించి నకిలీ పత్రాలు సృష్టించి, తనపై అపహరణ, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. ఈ కేసుల కారణంగా తాను 62 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చిందని తెలిపారు.
జైలు నుంచి విడుదల చేయించేందుకు, కేసులు ఉపసంహరించుకునేందుకు ప్రతిఫలంగా నెలకు రూ.15 లక్షల ఆదాయం వచ్చే ల్యాబ్ యాజమాన్యాన్ని తన పేరుకు బదిలీ చేయాలని వర్ష డిమాండ్ చేసిందని సచిన్ పేర్కొన్నారు. సామాజిక ఒత్తిడి, అవమాన భయంతో ఆమెను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అనంతరం పోలీసుల దర్యాప్తులో సచిన్ నిర్దోషిగా తేలడంతో, వర్ష ఫిర్యాదును అధికారులు కొట్టివేశారు.
వర్ష మూడో భర్తగా చెప్పబడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సందీప్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2023లో తన సంస్థలో రిసెప్షనిస్ట్గా చేరిన వర్ష, తనకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చి వివాహానికి ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. 2023 జూన్లో వివాహం జరిగినప్పటికీ, అప్పటికే జరిగిన రెండు పెళ్లిళ్ల విషయాన్ని తన నుంచి పూర్తిగా దాచిపెట్టిందని తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో వర్ష పలువురు యువకులపై లైంగిక వేధింపులు, అపహరణ వంటి కేసులు నమోదు చేసినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వర్షపై వచ్చిన ఆరోపణల నిజానిజాలు కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.

Post a Comment