బాసర ఆలయ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
బాసర ఆలయ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 22వ తేదీన ఆలయంలోని మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, వెండి పట్టీతో పాటు హుండీలోని నగదును అపహరించి పరారైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చోరీ చేసిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో బాసర రైల్వే స్టేషన్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ అలియాస్ రామకృష్ణ ఉన్నారు. వీరికి సహకరించిన మహారాష్ట్రకు చెందిన ఆనంద్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో నిందితులిద్దరూ ఇప్పటికే పలు దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు తేలింది. మరో కేసు విచారణ నిమిత్తం నిజామాబాద్కు వచ్చిన వారు, అక్కడే బాసర ఆలయంలో చోరీకి పాల్పడేలా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment