అంగన్వాడీ పోస్టుల ఎంపికలో పారదర్శకత.. దళారులను నమ్మి మోసపోవద్దు
అంగన్వాడీ పోస్టుల ఎంపికలో పారదర్శకత.. దళారులను నమ్మి మోసపోవద్దు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, తమకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు.
ఎంపిక ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశించిన అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరికీ ముందస్తుగా ఉద్యోగం ఖరారయ్యే అవకాశం లేదని, పూర్తిగా నిబంధనల ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా అధికారిక ప్రక్రియపై మాత్రమే ఆధారపడాలని జిల్లా సంక్షేమాధికారి సూచించారు. దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తే మోసపోయే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదిలా ఉండగా, అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే వారంలో ముఖాముఖి (ఇంటర్వ్యూ) నిర్వహించే అవకాశం ఉందని స్వర్ణలత లెనినా తెలిపారు. ఇంటర్వ్యూకు సంబంధించిన తేదీ, సమయం, వేదిక తదితర వివరాలను అధికారికంగా తెలియజేస్తామని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా పేర్కొన్నారు.

Post a Comment