హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ
హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ
హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోందని యూనివర్సిటీ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలిపారు. లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ సెనేట్ హౌస్లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కె. రామకృష్ణారావు, జయేశ్ రంజన్ పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం సుదీర్ఘంగా చర్చించింది.
ఈ భేటీలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS) ప్రతినిధులతో పాటు ఇతర విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో విస్తృత విద్యా కార్యక్రమాలు
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న క్యాంపస్ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, అకడమిక్ కార్యక్రమాలను అందించాలని యోచిస్తున్నట్లు ప్రతినిధులు వెల్లడించారు.
యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్గా అనుసంధానిస్తూ హైదరాబాద్ క్యాంపస్లో విద్యా కార్యక్రమాలను కొనసాగించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్యాంపస్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే అవకాశాలు పెరగనున్నాయి.
ఈ సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తరఫున కవితా రెడ్డి, LSEకి చెందిన రూత్ కట్టుమూరి, పాల్ మ్యాడెన్, ప్రొఫెసర్ ఫన్మి ఒలోనిఫాకిన్, డాక్టర్ స్కై జెంగ్, కీత్ హారిసన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment