జూబ్లీహిల్స్లో రూ.10 లక్షలకుపైగా నగదు స్వాధీనం ఉపఎన్నికల వేళ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై అధికార యంత్రాంగం కఠినంగా నిఘా పెట్టింది. ఈ క్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రూ.10 లక్షలకుపైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం, ఫ్లయింగ్ స్క్వాడ్ 3A బృందం అమీర్పేట్ ఎక్స్ రోడ్డులో వాహనాన్ని ఆపి రూ.1.50 లక్షలు స్వాధీనం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ 10A బృందం వెంకటగిరి కాలనీ రోడ్ నెం.2 వద్ద తనిఖీలు జరిపి రూ.2.30 లక్షలు పట్టుకుంది. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ 6B బృందం మధురానగర్లో రూ.6.50 లక్షలు స్వాధీనం చేసింది.
స్వాధీనం చేసిన మొత్తం నగదును సంబంధిత పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్లకు అప్పగించామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల కాలంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Post a Comment